సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ఫొటో జర్నలిస్టులపై చేసిన దాడులు.. పత్రికా స్వేచ్ఛను కాల రాసినట్లేనని తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.నరహరి పేర్కొన్నారు. ఢిల్లీలో పోలీసులు చేసిన దాడులను నిరసిస్తూ బుధవారం నగరంలోని బషీర్బాగ్లో ఆందోళన నిర్వహించారు. దాడులకు పాల్పడిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ నిరసనలను కవర్ చేయడం జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టుల పని అని, ఇదే క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసనను కవర్ చేస్తున్న ఫొటో జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడం అమానుషమని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టులపై దాడులు మానుకోవాలని, గాయపడిన ఫొటో జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఫొటో జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సంఘం కోశాధికారి కె.అనిల్కుమార్, కార్యవర్గ సభ్యులు నక్కా శ్రీనివాస్, ఎం.డీ. అలీముద్దీన్, ప్రతినిధులు జి.బాలస్వామి, సయ్యద్ మజార్, జనార్దన్ రెడ్డి, రామకృష్ణ, పిప్పళ్ల వెంకటేశ్, సురేశ్ రెడ్డి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.