మైలార్దేవపల్లి, అక్టోబర్ 9: అమాయకులను మోసం చేయడమే ఇతని టార్గెట్. ఏటీఎం కేంద్రమే ఇతని అడ్డా. వివరాల్లోకి వెళితే, మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఓ కేసు ఇతనిపై నమోదై ఉంది. బాధితులు తమ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు తెలియకుండానే డ్రా అవుతున్నాయనే ఫిర్యాదు మేరకు మైలార్దేవపల్లి డిటెక్టీవ్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తమ బృందంతో రంగంలోకి దిగారు. ఓ షోరూమ్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా సెల్ ఫోన్ కొన్నట్లు మేసేజ్ రావడంతో అక్కడి నుంచి విచారించగా, రాజేంద్రనగర్ ఫిష్ బిల్డింగ్ సమీపంలో షేక్ ఖుర్షిద్(28) జల్సాలకు అలువాటు పడి డబ్బు సునాయాసంగా రావాలనే ఉద్దేశంతో ఏటీఎం వద్ద పాగా వేసి, అమాయకులు, వృద్ధులను టార్గెట్ చేసేవాడు. అక్కడికి వచ్చిన వారు డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియని వారు వస్తుంటారు. అలాంటి వారి నుంచి ఏటీఎం కార్డు తీసుకొని నేను డబ్బు డ్రా చేసి ఇస్తానని నమ్మిస్తాడు. తమ వద్దనున్న ఏటీఎం కార్డును మారుస్తూ ఏటీఎం మిషన్లో పెట్టి పాస్వర్డ్ తెలుసుకొని డబ్బులు రావట్లేదని పంపించేవాడు. అక్కడి నుంచి తనకు నచ్చిన వాటిని షాపింగ్ చేస్తుండటం చేసేవాడు. ఓ షోరూంలో సెల్ఫోన్ కొనడంతో దొంగ పోలీసులకు దొరికి పోయాడు. నిందితున్ని పోలీసులు శనివారం అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.