సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసి, మరుసటి రోజు ఉదయమే వచ్చి అందులో నుంచి క్యాష్ను అపహరిస్తున్న క్యాష్ కస్టోడియన్తోపాటు అతడికి సహకరించిన మరోవ్యక్తిని కూడా రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్దనుంచి రూ. 55.80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కమిషనర్ డీఎస్ చౌహాన్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వరంగల్, మొగిలిచర్ల గ్రామానికి చెందిన పత్రి ప్రణయ్కుమార్ గత రెండేండ్లుగా సికింద్రాబాద్లోని సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ సంస్థలో క్యాష్ కస్టోడియన్గా పనిచేస్తున్నాడు.
ఉప్పల్ రూట్లోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో ప్రణయ్, శ్రీనివాస్ కలిసి క్యాష్ డిపాజిట్ చేస్తుంటారు. ఇక్కడి ఏటీఎం తాళాలు ప్రణయ్ వద్ద ఉండగా, దాని పాస్వర్డ్ శ్రీనివాస్ వద్ద ఉంటుంది. ఈ క్రమంలోనే గతనెల 31వ తేదీ రాత్రి ప్రణయ్, శ్రీనివాస్ కలిసి ఏటీఎం యంత్రాలలో క్యాష్ డిపాజిట్ చేసి వచ్చారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకే ఆఫీస్కు వెళ్లి అక్కడ కంప్యూటర్లో ఉన్న ఏటీఎం పాస్వర్డ్లను తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. ఆ రోజు శ్రీనివాస్ విధులకు హాజరుకాలేదు.
ఇదే అదనుగా భావించిన ప్రణయ్.. పీర్జాదిగూడలో రెండు, బండ్లగూడలో ఒకటి, జిల్లెలగూడలో రెండు ఏటీఎం కేంద్రాలలో రూ. 62.79 లక్షల నగదు అపహరించాడు. ఏటీఎంలలో డబ్బు త్వరగా అయిపోవడంతో ఈనెల 2వ తేదీన సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెలకు రూ. 16,000 జీతంతో ఉద్యోగం చేస్తున్న ప్రణయ్ విలాసాలకు అలవాటుపట్టాడు. తన వద్ద ఏటీఎం తాళాలు ఉండగా, మరొక వ్యక్తి వద్ద పాస్వర్డ్ ఉంటుంది.
ఈ రెండు మన వద్దనే ఉంటే ఈజీగా ఏటీఎం సెంటర్లలో లూటీ చేయవచ్చని ప్లాన్ వేసి.. దానిని ఈనెల ఒకటవ తేదీన అమలు చేశాడు. నిందితుడిని పట్టుకొని విచారించడంతో ఉప్పల్, పోచారం ఐటీ కారిడార్లలోని ఏటీఎంల నుంచి రూ. 2.5 లక్షల అపహరించినట్లు తెలిసింది. కాగా, దొంగిలించిన సొమ్ములో కొంత ఖర్చులకు వాడుకొని, మరికొంత తనకు తెలిసిన దొమ్మటి క్రాంతికుమార్ వద్ద దాచిపెట్టాడు. ఈ మేరకు నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి రూ. 55.80 లక్షల నగదు, సెల్ఫోన్లతో పాటు అతడికి సహకరించిన క్రాంతిని అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ జానకీ, ఏసీపీ నరేశ్ రెడ్డి, మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవర్ధన గిరి తదితరులు పాల్గొన్నారు.