తొలుచూరు మగబిడ్డ పుట్టాడని మురిసిపోయిన తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. అందంగా సాగుతున్న బాల్యంలో అనుకోని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయ్యో బిడ్డా..ఒక చేత్తో ఎట్లా.. అంటూ అమ్మ కన్నీళ్లు కార్చింది. మరో చేయి మిగిలే ఉందని ధైర్యంగా ముందుకు కదిలాడు సంజీవయ్య. ఆటనే ప్రాణంగా ప్రేమించిన అతని ప్రతిభకు ఎన్నో పతకాలు దాసోహం అన్నాయి. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఎందుకు పనికిరామని కుంగిపోతున్న నేటి యువతకు సంజీవయ్య జీవితమే ఆదర్శం.
నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం జానకంపేటకు చెందిన తలారి ఎర్రన్న, గంగుబాయి సంతానమే సంజీవయ్య. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కుటుంబంలో పాముకాటు తీవ్ర విషాదాన్ని నింపింది. సంజీవయ్య ఆరో తరగతి చదివే సమయంలో పాము కరిచింది. వెంటనే దవాఖానకు తరలించినా విషం పాకడంతో వైద్యులు చేయి తొలగించారు. ఒక చేయితో ఉన్న చిన్నారిని చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు. బాబు బతికాడనే సంతోషంతో ఉబికివస్తున్న కన్నీళ్లను దిగమింగుకుని కష్టపడి చదివించారు. సంజీవయ్యకు ఆటలపై ఉన్న మక్కువతో బ్యాడ్మింటన్, ఖోఖోలపై దృష్టి పెట్టాడు. 1986లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలో ఉత్తమ ర్యాంకుతో దివ్యాంగుల రిజర్వేషన్లో ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని రైల్వే నిలయంలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు.
ఓ వైపు రైల్వేలో ఉద్యోగం చేస్తూనే సంజీవయ్య బ్యాడ్మింటన్లో పట్టు సాధించాడు. ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సంజీవయ్యను రైల్వే అధికారులు ప్రోత్సహించారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు గెలిచి సత్తా చాటాడు. ఇప్పటి వరకు 24 దేశాలలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న సంజీవయ్య అనేక పతకాలతో దేశ పతాకాన్ని రెపరెపలాడించాడు.
2008లో జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్చాంపియన్షిప్లో పతకం
2009 సెప్టెంబర్లో బెంగళూర్లో ఇంటర్నేషనల్ వీల్చైర్ అమెచ్యూర్స్పోర్ట్స్ పోటీలో డబుల్స్లోబంగారు పతకం
2010 నవంబర్లో ఇజ్రాయిల్లోని టెలఅవీవ్, డిసెంబర్లో చైనాలోని గ్వాంగ్జావ్లో పారా ఒలింపిక్ టోర్నమెంట్లో బంగారు, రజిత, కాంస్య పతకాలు
2012 ఏప్రిల్లో ఫ్రెంచ్ ఓపెన్లో సిల్వర్ మెడల్
2014 జూన్లో లండన్ ఓపెన్ చాంపియన్షిప్, 2014లో సియోల్లో ఓటమి
2016లో ఇండోనేషియాలో డబుల్స్లో సిల్వర్ మెడల్
2021లో టోక్యోలో జరిగిన పారా ఒలింపిక్స్కు ఎంపికైనా అనారోగ్యంతో గైర్హాజరు.