మేడ్చల్ రూరల్, డిసెంబర్ 1 : మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్కు ఇనిస్టిట్యూషనల్ కేటగిరిలో ఆసియా కొవిడ్ వారియర్స్ అవార్డు దక్కింది. జపాన్లోని టోక్యోలో నవంబర్ 30న జరిగిన 6వ ఆసియా ఈఎంఎస్ కాన్ఫరెన్స్కు ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ ప్రతినిధిగా వెళ్లిన సంస్థ సీనియర్ అసోసియేట్ డాక్టర్ రాజనర్సింహ ఈ అవార్డును అందుకున్నారు. జీవీకే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ సేవలు కొనసాగుతున్నాయి.
కాల్ ఆఫ్ డ్యూటీకి మించి పనిని ప్రదర్శించినందుకు తమ ఇనిస్టిట్యూట్కు ఈ అవార్డు లభించిందని ఈఎంఆర్ఐ జీహెచ్ఎస్ డైరెక్టర్ జీవీ కృష్ణంరాజు తెలిపారు. కొవిడ్ -19 సమయంలో వైరస్ సోకిన వారిని 108 వాహనంలో దవాఖానకు తరలించడమే కాకుండా.. చికిత్స అనంతరం వారిని అదే వాహనంలో హోం క్వారంటైన్కు తరలించామని తెలిపారు. ఇతర వాహనాల్లో తరలిస్తే వైరస్ వృద్ధి చెందే అవకాశం ఉన్నందున తమ సంస్థ ఆధ్వర్యంలో కొవిడ్ పేషెంట్లకు ఉపయోగించిన వాహనాల్లోనే తరలించి.. సేవలందించామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందించిన తమ సేవలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వరకే గుర్తించాయన్నారు. సేవలను గుర్తించి అవార్డును అందించినందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు.