ముఖ్య అతిథిగా కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ దంపతులు
సిటీబ్యూరో, జూలై 16(నమస్తే తెలంగాణ): ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను ఐటీ కారిడార్లోని టీ హబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు జరిగాయి. టీటా అధ్యక్షులు సందీప్ కుమార్ మక్తల అధ్యక్షతన బోనాల వేడుక వైభవంగా జరిగింది. ఇందుకు ముఖ్య అతిథులుగా కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్, ఆయన సతీమణి అరుణా దీపక్ ఆనంద్లు పాల్గొన్నారు.
వందలాది మంది ఐటీ ఉద్యోగులు కలిసి తెలంగాణ సంప్రదాయ పండగైన బోనాలను ఐటీ కారిడార్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. గత 13 ఏళ్లుగా ఐటీ ఉద్యోగులంతా కలిసి మాదాపూర్ సైబర్ టవర్స్ వద్దనున్న అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. కాగా, ఈసారి కెనడా మంత్రి దీపక్ ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. గత రెండేళ్లుగా టీ హబ్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు కలిసేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సందీప్ కుమార్ తెలిపారు.