సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ‘సుమేథసా- హెరిటేజ్ ఫెస్ట్’ వార్షిక ప్రతిభా పాటవ పోటీల విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో శనివారం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథిగా డీఐజీ (ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) బి.సుమతి హాజరయ్యారు. అక్షయపాత్ర (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షులు శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ మాట్లాడుతూ..
రంగోళి, గీతా శ్లోక పఠనం, పురాణ వేషధారణ, పూలతో అలంకరణలు, జానపద నృత్యం, శాస్త్రీయ సంగీతం, ఉపన్యాసాలు, చిత్రలేఖనం, బొమ్మలను రంగులతో నింపడం, నోరూరించే వివిధ రకాల ప్రసాద వంటకాల తయారీ తదితర అంశాలతో హెరిటేజ్ ఫెస్ట్ నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో 60 పాఠశాలలకు చెందిన 12వేల మంది విద్యార్థులు పాల్గొనగా, 1200 మంది సెమీఫైనల్కు వచ్చారని, అందులో 500 మంది ఫైనల్కు రాగా, 160 మంది విజేతలుగా నిలిచారన్నారు. అనంతరం అతిథి డీఐజీ సుమతి చేతుల మీదుగా విద్యార్థులకు అవార్డులను అందజేశారు.