అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఇంట్లో సహాయకుడిగా చేరాడు. రెండేండ్లు నమ్మకంగా పనిచేసి.. అన్నం పెట్టిన ఇంటికే కన్నంవేసి పారిపోయిన వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు అరెస్టు చేసి అతడి వద్దనుంచి రూ.6.75 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ లక్ష్మీనారాయణ, డీఐ నాగేశ్వర్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన మెరుగు శశికిరణ్(34) పదో తరగతి వరకు చదివి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. 2017లో సైనిక్పురిలోని వీకేర్ ఏజెన్సీలో ఉద్యోగిగా చేరాడు.
అక్కడ నమ్మకంగా పనిచేయడంతో అతడిని కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో నివాసముండే సూరపనేని మోహన్రావు ఇంట్లో కేర్టేకర్గా చేర్చుకున్నారు. సూరపనేని మోహన్రావుకు స్వల్పంగా పక్షవాతం ఉండటంతో 2018 నుంచి ఇప్పటి వరకు నమ్మకంగా అతడికి సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలో పది రోజులకిందట ఇంట్లో ఎవరూలేని సమయంలో బీరువాలో దాచిన రూ.7.80 లక్షలు తీసుకుని కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకు గురైన మోహన్రావు కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రూ.6.75 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి రివార్డులను అందజేశారు.