సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఓఎల్ఎక్స్లో సెల్ఫోన్లు విక్రయించే వారిని లక్ష్యంగా చేసుకొని, వారి దృష్టి మళ్లించి ఫోన్లను అపహరిస్తున్న ఇద్దరు నేరగాళ్లను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇక్రముద్దీన్ అలియాస్ ఇక్రమ్, మహ్మద్ హసన్ స్నేహితులు. వీరిద్దరూ ఓఎల్ఎక్స్ యాప్లో ఎవరైనా సెల్ఫోన్ విక్రయించేందుకు ప్రకటన ఇస్తే, వారిని టార్గెట్ చేస్తారు. సెల్ఫోన్ కొనుగోలు చేస్తామని నమ్మించి.. వారు సూచించిన ప్రదేశానికి రావాలని కాల్ చేస్తారు. వీరి మాటలు నమ్మిన ఫోన్ల యజమానులు వారు సూచించిన ప్రదేశానికి వెళ్తున్నారు.
బాధితులను మాటల్లో పెడుతున్న నిందితులు.. దృష్టి మళ్లించి ఫోన్ చూస్తామని చెప్పి అక్కడి నుంచి పారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 17న ఐఫోన్-12 విక్రయ ప్రకటనను ఓఎల్ఎక్స్లో చూసిన నిందితులు.. తాము కొంటామంటూ బాధితుడిని నమ్మించి.. కేబీఆర్ పార్కు వద్దకు రప్పించారు. అతడిని బెదిరించి రెండు ఫోన్లు తీసుకొని ఉడాయించారు. వీరి నేరాలపై బాధితులు బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలపై సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ బృందం నిఘాపెట్టి.. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని విచారించింది. వారివద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, నేరానికి ఉపయోగించిన యాక్టివా, ఒక స్విఫ్ట్కార్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సహకరించిన రిజ్వాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.