కాచిగూడ : ద్విచక్రవాహనంలోంచి నగదు మాయం చేసిన దొంగను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం శాలిబండ ప్రాంతానికి చెందిన మహ్మాద్ షకీల్ అలియాస్ నయాబ్ (17) పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలలోంచి నగదు దొంగిలిస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు.
ఇదే క్రమంలో కాచిగూడ భూమన్నలైన్ ప్రాంతానికి చెందిన శ్రీవన్ విజయ్వర్గీ (62) ఈ నెల 8న బర్కత్పురలోని సూర్యభగవన్ దేవాలయం ముందు ఏపీ 09 సీఎస్ 1007 హోండ అక్టీవా ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసరికి అక్టివాలో ఉన్న రూ.2,65,000 వేల రూపాయలను నయాబ్ దొంగిలించాడు.
విజయ్వర్గీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా షకీల్ను గురువారం అరెస్ట్ చేసి రూ.2,65,000 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్సై వీర మల్లయ్య తెలిపారు.