సికింద్రాబాద్ : తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని కార్ఖాన పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. జీడిమెట్ల సుబాష్నగర్ కాలనీకి చెందిన మహ్మద్ ఆహ్మద్ పాషా ( 26 ) రోజు కూలిగా పనిచేసేవాడు.
2021 సంవత్సరంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలోని బోయిన్పల్లి, తిరుమలగిరి, మేడ్చల్, జవహర్ నగర్, జీడిమెట్ల, కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేసేవాడని విచారణలో వెల్లడైందని డీసీపీ చెప్పారు.
కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని విక్రయిస్తున్నాడని విశ్వనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఎట్టకేలకు మహ్మద్ పాషాను అదుపులోకి తీసుకుని విచారించారు. 2018లో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసులో చంచల్గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. అదే విధంగా మరో కేసులో 2021 జూలై 2న చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
తన బుద్ధి మారకపోవడంతో పాటు జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నాడని డీసీపీ తెలిపారు. నిందితుడి నుంచి 1.2 కిలోల గంజాయి, హాష్ ఆయిల్ ప్యాకెట్, 12 గ్రాముల బంగారు ఆభరణాలు. రూ 5 వేల నగదు, 10 సెల్ఫోన్లు. 32 ఇంచుల స్మార్ట్ టీవీ, బైకు, చోరీలకు వినియోగించే స్కూడ్రైవర్ పనిముట్టును పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండుకు తరలించారు. మీడియా సమావేశంలో మహాంకాళి ఏసీపీ రమేష్ కారానా సీఐ రవీందర్, డీఐ నేతాజీ, మురళీలు ఉన్నారు.