కవాడిగూడ( హైదరాబాద్ ) : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్ మోదీ ప్రభుత్వ అప్రకటిత ఎమర్జెన్సీ (Emergency) లో భాగమేనని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ (AAP convener Sudhakar) ఆరోపించారు. ఈ నెల 31న ఆప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఛలోఢిల్లీ’ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా ప్రతిపక్షాలతో పోరాడే దమ్ములేక ప్రధాని నరేంద్ర మోదీ (Modi) అణిచివేత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థల ముసుగులో ప్రతిపక్ష పార్టీలను, మీడియాతో సహా అన్ని సంస్థలను బంధించి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన కేజ్రీవాల్ను చట్టవిరుద్దంగా ఈడీ చేత అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ (BJP) తన పైశాచిక చర్యల్లో భారత ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానికి కుట్ర ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆప్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు బుర్రా రాముగౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు హేమ జిల్లోజు, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ జమున గౌడ్, అధికార ప్రతినిధి జావేద్ షరీఫ్, దివ్యాంగ విభాగం కన్వీనర్ దర్శనం రమేష్, నాయకులు కొడంగల్ శ్రీనివాస్, మౌనిక పాల్గొన్నారు.