జియాగూడ, డిసెంబర్ 31 : కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని జియాగూడ డివిజన్ ప్రాంతంలోని చారిత్రాత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవస్థానంలో వైకుంఠ (ముక్కోటి ) వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ, విద్యుత్, జలమండలి, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, అధ్యాత్మిక సంస్థల సభ్యులు పనుల్లో నిమగ్నమైనారు.ఆలయం ఎదుట దశావతారంలో దేవతాముర్తులు, వైకుంఠ ద్వారం, క్షీరసాగరంలో శ్రీమహవిష్ణువు, మండపంలో లక్ష్మీదేవి, రహదారులపై విద్యుత్ అలంకరణలో స్వాగత వేదికలు, విదేశాల నుంచి ప్రత్యేక పుష్పాలు, దేవతాముర్తుల అలంకరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నగర మేయర్, హైకోర్టు న్యాయమూర్తులు, పలు రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
తిరుమల తిరుపతి తరహాలో..
నూతన సంవత్సరం జనవరి 2న వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలను తిరుమల తిరుపతి తరహాలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో దేవస్థానంలో చేపట్టనున్న ఏర్పాట్లపై కొన్ని రోజుల క్రితం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐదు సంవత్సరాలుగా మంత్రి స్వయంగా పనులను చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున శ్రీరంగనాథస్వామికి మంత్రి తలసాని, మరి కొందరు ప్రముఖులు పట్టు వస్ర్తా సమర్పించనున్నారు.
ప్రముఖుల తాకిడి ఎక్కువ ఉండే దేవస్థానం ..
ప్రముఖుల తాకిడి ఎక్కువ ఉండే దేవస్థానం కావడంతో భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు పశ్చిమ మండల డీసీపీ, గోషామహాల్ ఏసీపీ ఆర్.సతీశ్కుమార్, పోలీసు శాఖల అధికారులు పేర్కొంటున్నారు. దేవస్థానం లోపలి నుంచి , క్యూలైన్లు వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. విద్యుత్ సరఫరా నిలిచి పోకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టనున్నారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో క్యూలైన్లు, వీఐపీ క్యూలైన్లు, డివైడర్లు తదితర పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనులు చేపడుతున్నారు. ఆలయ అర్చకులు శేషాచార్యులు, రాజగోపాల చార్యులు ఉత్సవ ఏర్పాట్లను చేపడుతున్నారు.
భక్తులందరికీ దర్శనం కల్పిచేందుకు ఏర్పాట్లు..
భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఉత్తర ద్వార దర్శనంతో పాటు క్షీరసాగరంలో స్వామి వారి దర్శనం కనువిందు చేస్తుంది. దక్షిణ భారతదేశంలో క్షీరసారగరంలో శ్రీమహావిష్ణువు దర్శనం కేవలం శ్రీరంగనాథస్వామి దేవస్థానంలోనే కలుగుతుంది.
– శేషాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు