బేగంపేట్, జూలై 7: ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, ఉత్తర మండలం డీసీపీ చందన దీప్తి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, జలమండలి డైరెక్టర్ కృష్ణలతో కలిసి మంత్రి దేవాలయ పరిసరాలను సందర్శించి చేపట్టాల్సిన ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు అమ్మవారికి తొలిబోనం సమర్పించనున్నట్లు తెలిపారు. అప్పటికే అసంఖ్యాకంగా భక్తులు తరలి వస్తారని, ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను మంత్రి జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల అధికారులకు వివరించారు.
దేవాలయానికి దారి తీసే అని రోడ్లు భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు కిందకు వేళాడుతున్నట్టు భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ట్రాన్స్కో అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. దేవాలయ పరిసరాల్లో ఎక్కడా మురుగునీటి సమస్యలు తలెత్తకుండా జలమండలి అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా భక్తులకు ఎక్కడా అస్కౌర్యం కలుగకుండా బారికేడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, భక్తుల దాహార్తిని తీర్చేందుకు అడుగడుగునా మంచినీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జాతర కారణంగా దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంత, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, ట్రాన్స్కో డీఈ సుధీర్, దేవాదాయ అదనపు కమిషనర్ రామకృష్ణ, సహయ కమిషనర్ కృష్ణ, తాశీల్దార్ శైలజ, ఆలయ ఈవో గుత్తా మనోహర్రెడ్డిలతో పాటు దేవాలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.