మణికొండ, మార్చి 4: హిట్ అండ్ రన్.. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు..ఆర్మీ జవాన్ను ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయపడిన జవాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సోమవారం నార్సింగి పోలీస్స్టేసన్ పరిధిలో జరిగింది. రాందేవ్గూడ ఆర్టిలరీ సెంటర్లో జవాన్గా విధులు నిర్వహిస్తున్న కులాన్(34) నార్సింగి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డును దాటుతుండగా, గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో కులాన్ దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. ఐడెంటీ కార్డు ఆధారంగా మృతుడు జవాన్ కులాన్గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు ఆ మార్గంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా..రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఆర్మీ జవాన్ కులాన్ విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వచ్చాడా..ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.. అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.