నేరేడ్మెట్ , మే 14: నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ కేసును నేరేడ్మెట్ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. అరస్టైన వ్యక్తి ఆర్మీలో జనరల్ డ్యూటీ జవాన్గా పనిచేస్తుండటం సంచలనంగా మారింది. అతడి వద్ద నుంచి మూడు తులాల బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మీడియా సమావేశంలో ఏసీపీ వి. యాదగిరి రెడ్డి వివరాలు వెల్లడించారు. ఏపీ కడప జిల్లాకు చెందిన కుర్రపోతుల రెడ్డిశేఖర్ (31)ప్రస్తుతం అల్వాల్లోని త్రిశూల్ లైన్ ఆర్మీ క్వార్టర్స్లో నివాసం ఉంటూ ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు.
క్రికెట్ బెట్టింగ్కు బానిసై అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశంతో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 10వ తేదీ సాయంత్రం తన నల్లరంగు బజాజ్ పల్సర్ బైక్పై బయటకు వచ్చిన నిందితుడు ముందుగా డాల్పిన్ వైన్ షాపు సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద ఆగాడు. అనంతరం సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు తన బైక్ నంబర్ ప్లేట్ను మార్చి నకిలీ స్టిక్కర్ అమర్చుకున్నాడు.
తర్వాత సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న జొన్నగడ్డ యోగేందర్ మణి మేఘల (57)ను లక్ష్యంగా చేసుకుని ఆమెను అడ్రస్ అడిగినట్లు నటించి మెడలో ఉన్న మూడు తులాల నల్లపూసల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా పుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు ఈనెల 13వ తేది రాత్రి అల్వాల్లోని డాల్పిన్ వైన్ షాప్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ఛేదనలో మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్,ఏసీపీ వి. యాదగిరి రెడ్డి , నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ పి. సందీప్కుమార్, ఎస్ఐ జి. చంద్రశేఖర్ , అవినాష్తో పాటు క్రైమ్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు.