దుండిగల్/బంజారాహిల్స్, అక్టోబర్ 27: షాపూర్నగర్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) – బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా చూపి కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన బీజేపీ నాటకం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు పలు చోట్ల నిరసన చేపట్టారు. సూరారం, సుభాష్నగర్ డివిజన్లకు చెందిన పార్టీ శ్రేణులు షాపూర్నగర్ చౌరస్తాలో మోదీ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న బీజేపీ శ్రేణులు దిష్టిబొమ్మపై ఉన్న మోదీ ఫొటోను తొలగించారు. అదే సమయంలో అటు బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటూ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ వాగ్వావాదానికి దూసుకెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జీడిమెట్ల పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఇరుపార్టీల శ్రేణులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.
యూసుఫ్గూడలో ఉద్రిక్తత..
కొంతమంది బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడంతో యూసుఫ్గూడ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసలే ఆగ్రహంతో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో పాటు దిష్టిబొమ్మ దహనం చేయకుండా తరిమికొట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అడ్డంగా దొరికిపోయినా సిగ్గులేకుండా బయటకు వచ్చి ఆందోళనలు ఎలా చేస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.