సిటీబ్యూరో, డిసెంబరు 6 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర వేడుకలకు ఈవెంట్స్ నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 20లోపు కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా సూచించారు. ఈ నెల 31న నిర్వహించే నూతన సంవత్సర వేడుకల నిర్వాహకులు న్యూ ఇయర్ -2024 ఈవెంట్.. ‘పర్మిషన్ అప్లికేషన్’ పేరుతో ఉన్న దరఖాస్తులను సైబరాబాద్ పోలీసు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
అన్ని వివరాలతో పూరించిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయం ఇన్వార్డ్లో సమర్పించాలని తెలిపారు. అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.