సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై ప్రజల్లో మరింత నమ్మకం కల్పించేందుకు జలమండలి ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది. నీటి సరఫరా, క్వాలిటీని పరీక్షించడానికి ‘నాణ్యత’ పేరుతో ఈ యాప్ను ఎండీ దానకిశోర్ అందుబాటులోకి తీసుకువచ్చారు. వినియోగదారుడి ఇంటి వద్దే నీటి సరఫరా సమయం, నాణ్యత వివరాలను సంబంధిత యాప్లో నమోదు చేస్తారు. ప్రతి వీధి, కాలనీలకు ఇద్దరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరికి నీటి పరీక్షకు సంబంధించిన ప్రత్యేక కిట్ను అందజేస్తున్నారు.
పరీక్షలకు 3 పారామీటర్లు..
పరీక్షలు జరపడానికి 3 పారా మీటర్లు తీసుకున్నారు. నీటి సరఫరా స్థితి, ఇందులో వినియోగదారుడు నీటి సరఫరా జరిగిందో లేదో తెలియజేయాల్సి ఉంటుంది. రెండవది సరఫరా సమయం.. నీటి సరఫరా నిర్ణీత సమయంలో జరిగిందా ? లేదా, ఏమైనా తేడాలు ఉన్నాయా? తెలుపాలి. సరఫరా నాణ్యత (క్వాలిటీ)… సరఫరా అయ్యే సమయంలో నీటి నాణ్యతను వినియోగదారుడు (జలమిత్ర) సమక్షంలో పరీక్షించి యాప్లో పొందుపరచాలి. సమయానికి నీటి సరఫరా జరగకున్నా, నిర్ణీత సమయంలో నీటి సరఫరా కాకున్నా.. కలుషిత నీరు వచ్చినా- క్లోరిన్ శాతంలో తేడాలున్నా..సంబంధిత సమస్యలు జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్న మెట్రో కస్టమర్ కేర్ (ఎంసీసీ)కు ఆటోమెటిక్గా ఫిర్యాదు అందేలా యాప్ను రూపొందించారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు జలమిత్రతో పాటు స్థానిక మేనేజర్కు ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. దీంతో మేనేజర్ త్వరితగతిన ఆ సమస్యను పరిషరించడానికి అవకాశముంటుంది.
రోజూ 15వేల క్లోరిన్ పరీక్షలు
ఇప్పటికే నీటి సరఫరాలో జలమండలి మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియను అవలంబిస్తున్నది. దీంతో పాటు ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఐఎస్ఓ 10500 – 2012 ప్రకారం శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటుంది. రోజూ నగర వ్యాప్తంగా 15 వేల క్లోరిన్ పరీక్షలు చేస్తోంది.