కొండాపూర్, అక్టోబర్ 26: డిజిటలైజేషన్తో సమకాలీన అనుభవం వల్ల ‘సామాజిక పరివర్తనలో కలిగే మార్పులు, టెక్నాలజీ ప్రభావం, ఏఐ, ఇంటర్నెట్’ అంశాలపై గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మానవశాస్త్రం, డిజిటల్ కల్చర్’ సదస్సులో ప్రముఖ వక్తలు పాల్గొని ప్రసంగించారు. వర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఆంత్రోపాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎం.రోమేష్ సింగ్ అధ్యక్షత వహించగా, డిజిటల్ ఆంత్రోపాలజీ రంగంలో ప్రముఖ స్కాలర్ ప్రొఫెసర్ డానియేల్ మిల్లర్ ముఖ్య అతిథిగా హాజరై డిజిటల్ ఆంత్రోపాలజీ అధ్యయనంతో మానవ విజ్ఞానాన్ని ఎలా మెరుగుపర్చుకోవచ్చనే అంశంపై ప్రసంగించారు.
రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ ఎండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్లు భాగస్వాములుగా వ్యవహరించాయి. ఈ కార్యక్రమంలో 100కు పైగా కార్యకర్తలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ప్లానర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.