Gold ATM | అమీర్పేట, డిసెంబర్ 29: నగరంలో మరో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీఎంను శుక్రవారం అమీర్పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో ప్రారంభించారు. గతేడాది డిసెంబర్లో బేగంపేటలో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించామని, తాజా ఏటీఎం మరిన్ని సదుపాయాలతో కూడిన వర్షన్-2 అని గోల్డ్ సిక్కా చైర్మన్ అంబిక బర్మన్, సీఈవో సయ్యద్ తారుచ్ తెలిపారు.
గతంలో డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎం నుంచి నాణేలను డ్రా చేసుకునే అవకాశం ఉండేదని, ఈ వర్షన్-2లో యూపీఐ విధానంలో క్యూర్ కోడ్ స్కాన్ ద్వారా కూడా నగదు చెల్లించి బంగారు, వెండి నాణేలను పొందవచ్చన్నారు. 99.99% నాణ్యత గ్యారెంటీ తెలిపే పత్రాలతో సహా 0.5, 1, 2, 5, 10, 20 గ్రాముల బంగారం, వెండి 10, 20, 50, 100 గ్రాముల నాణేలను డ్రా చేసుకునే వీలుందని, అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయన్నారు. దేశ, విదేశాల్లో 2 నుంచి 3 వేల గోల్డ్ ఏటీఎంలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.