సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పాలనలో మరో కీలక అధ్యాయం మొదలుకానున్నది. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం మరో వారం రోజుల్లో (ఫిబ్రవరి 10న) పూర్తి కానుంది. మేయర్, డిప్యూటీ మేయర్ సహా 150 మంది కార్పొరేటర్లు మాజీలు కానున్నారు. దీంతో ఫిబ్రవరి 11 నుంచి పాలన అధికార యంత్రాంగం చేతుల్లోకి వెళ్లనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా, బల్దియా విభజన అంశం ఇప్పుడు రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నది.
మూడు ముకలాట.. సేవలు చేరువయ్యేనా?
మెగా సిటీగా విస్తరించిన హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యమని సరార్ చెబుతుండగా, రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీనంతో 150 నుంచి 300 వార్డులు, ఆరు జోన్లు కాస్తా 12 జోన్లు, 30 నుంచి 60 సర్కిళ్లుగా చేసిన అధికారులు, ఫిబ్రవరి 10 తర్వాత జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించి పాలన అందించేందుకు సర్కారు ఇప్పటికే అన్ని చర్యలు పూర్తి చేసింది.
సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ వరకు ఉన్న ఏరియాను 150 వార్డులతో ప్రస్తుత జీహెచ్ఎంసీగా కొనసాగించనున్నారు. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ ఐటీ కారిడార్ జోన్లకు కలుపుకుని 75 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీనగర్, ఉప్పల్, కీసర పరిధిలోని తూర్పు ప్రాంతం కలుపుకుని 75 వార్డులతో మల్కాజిగిరి కార్పొరేషన్ చేయాలని భావిస్తున్నది. ఐతే ప్రస్తుత జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్)తో పాటు గ్రేటర్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందా? లేదా సికింద్రాబాద్ పేరుతో ఏర్పాటు చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది. మూడో కార్పొరేషన్గా గ్రేటర్ సైబరాబాద్ మున్పిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయనున్నారు.
జీహెచ్ఎంసీని ప్రస్తుత ప్రధాన కార్యాలయ కేంద్రంగా, సైబరాబాద్ కార్యాలయం మాదాపూర్ న్యాక్లో, మల్కాజిగిరి కార్యాలయం తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయ కేంద్రంగా పాలన అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు సర్కారు కసరత్తు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే నిధుల కొరత, విభజన సవాళ్ల మధ్య బల్దియాలో ప్రత్యేక పాలన పట్టాలెకనున్నది.
ఆస్తులు, అప్పులు ఎలా?
గ్రేటర్ను మూడు కార్పొరేషన్లుగా చేయడం ద్వారా ఆస్తులు, అప్పుల పంపకం అధికారులకు కత్తిమీద సాములా మారనుందన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటికే బల్దియా తలపై ప్రస్తుతం సుమారు రూ. 4,800 కోట్ల రుణభారం ఉంది. ప్రతి నెలా వడ్డీలు, అసలు రూపంలోనే రూ. 120 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం ఎకువగా వచ్చే సైబరాబాద్ ప్రాంతం విడిపోతే, పాత నగరం, శివారు ప్రాంతాలతో కూడిన మిగిలిన కార్పొరేషన్లు ఆర్థికంగా ఎలా నిలదొకుకుంటాయనేది సందేహమే. జీతాల చెల్లింపులకే ఖజానా వెతుకోవాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ ఇప్పటికే ముగిసినప్పటికీ, కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం. అప్పటి వరకు మేయర్, కార్పొరేటర్ల సందడి లేకుండానే బల్దియా కార్యాలయం వెలవెలబోనుంది.