ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 27: ఉస్మానియా యూనివర్సిటీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను సోమవారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.685.79 కోట్లు కాగా.. వ్యయం రూ.752.79 కోట్లు ఉన్నది. దీంతో రూ.42.64 కోట్ల లోటుతో బడ్జెట్ను ఆమోదించారు. ఇందులో ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ రూ.457.10 కోట్లు, మిగిలిన నిధులను యూనివర్సిటీ అంతర్గతంగా సమకూర్చుకోనున్నది. గతేడాదితో పోలిస్తే బ్లాక్గ్రాంట్ను సుమారు పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఓయూ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో అకాడమిక్ సెనేట్ జరిగిన సమావేశంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను చదివి వినిపించారు. ఈ నివేదికలో గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తీసుకున్న ప్రత్యేక చర్యలు తదితర వాటిని వివరించారు. యూనివర్సిటీ నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ల గురించి పేర్కొన్నారు.
సభ్యుల ఏకాభిప్రాయంతో బడ్జెట్కు ఆమోదం
ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వర్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకాభిప్రాయంతో బడ్జెట్ను ఆమోదించారు. ఓయూకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నుంచి రూ.457.10 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరుకాగా, గతేడాది ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ.24.36 కోట్లు. వివిధ గ్రాంట్ల రూపేణా ప్రభుత్వం నుంచి రూ.55.00 కోట్లు మంజూరైంది. మిగిలిన మొత్తం వర్సిటీ భరించాల్సి ఉంటుంది. ఇందులో రూ.36.45 కోట్లు అంతర్గత ఆదాయాల ద్వారా, ఎగ్జామినేషన్ బ్రాంచ్, యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్స్ ఆఫీస్, పీజీఆర్ఆర్సీడీఈ, డైరెక్టరేట్ ఆఫ్ పీజీ అడ్మిషన్స్, డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ఆడిట్, టీఎస్పీజీఈటీ కన్వినర్ తదితర సంస్థల నుంచి నిధుల మళ్లింపు ద్వారా రూ.134.54కోట్లు, లోన్లు, అడ్వాన్స్ల వసూల ద్వారా రూ.2.70 కోట్లు సమకూర్చుకుంటామని పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకు రూ.416.33 కోట్లు కాగా, పెన్షన్లకు రూ.293.00 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆకస్మిక అవసరాలకు రూ.40.76 కోట్లు, ఉద్యోగుల లోన్లకు రూ.2.7 కోట్లు కేటాయించారు.
బడ్జెట్లో సింహ భాగం వేతనాలు, పెన్షన్లే
యూనివర్సిటీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో సింహ భాగం ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ చేసిన వారి పెన్షన్లకే సరిపోతున్నది. ఉద్యోగుల వేతనాలకు రూ.416.33 కోట్లు అవసరముండగా, ఇది వర్సిటీ మొత్తం బడ్జెట్లో 55.31 శాతం కావడం గమనార్హం. అదేవిధంగా పెన్షన్లకు మరో రూ.293.00 కోట్లు కేటాయించగా, ఇది 38.92 శాతంగా ఉంది. మిగిలినదానిలో 5.41శాతం కాంటిజెన్సీకి, 0.36 శాతం ఉద్యోగుల రుణాలకు కేటాయించారు. అయితే వేతనాలు, పెన్షన్లకు మొత్తం బడ్జెట్లో 94.23 శాతం పోతున్నది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఈ శాతం 65.75 ఉండగా, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా వర్సిటీపై మరింత భారం పడింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి పెనుమార్పులు
రానున్న విద్యాసంవత్సరం నుంచి మెడికల్, ఇంజినీరింగ్ పట్టభద్రులకు సైన్స్ విభాగాల్లోని పీజీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏ విభాగంలో పట్టభద్రులైనప్పటికీ ఎంకామ్లో ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఓయూ దూరవిద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్లో 70 కోర్సులను అందించనున్నామని చెప్పారు. దూరవిద్య కోర్సులు సెమిస్టర్ విధానంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు.