చేర్యాల, జనవరి 28: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి రోజున నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ వర్గాలు ఆలయం, రాజగోపురం, గదులకు రంగులు వేయించి సుందరంగా ముస్తాబు చేశారు. కాగా, ఈ నెల 22న ఆదివారం నిర్వహించిన పట్నం వారానికి భక్తులు పోటెత్తారు. యాభై వేల పైచిలుకు భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారు. హైదరాబాద్కు చెందిన భక్తులు మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో చేపట్టి ఆలయంలో విరమించారు. స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. కాగా, బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయవర్గాలు ఈ సంవత్సరం ప్రత్యేకంగా క్యూలైన్లలో తాగునీటి వసతి కల్పిస్తున్నారు. భక్తులకు విశిష్ట దర్శనం, శ్రీఘ్రదర్శనం, ధర్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నేడు లష్కర్ వారం…
ఉత్సవాల్లో రెండో ఆదివారం (నేడు) లష్కర్ వారం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సికింద్రాబాద్ భక్తులతో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్ పాత జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. సికింద్రాబాద్ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లన్న దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుండటంతో రెండో ఆదివారానికి లష్కర్ వారంగా ఎనకటి నుంచి పిలుస్తున్నారు. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ తెలిపారు.