సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చేందుకు సిటీ పోలీసులు చేస్తున్న కృషిలో మేము సైతమంటూ.. సామాన్యులూ భాగస్వాములవుతున్నారు. ఇలా పౌరుల సహకారంతో ‘మత్తు’ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బహుముఖ వ్యూహాలతో నేరస్తుల ఆటకట్టిస్తున్నారు.
నగరంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టి గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. దందాను కూకటివేళ్లతో తొలగించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గంజాయి అనేది నగరంలోకి రాకుండా చేస్తే చాలా వరకు కట్టడి చేసినట్లే అవుతుందని భావించి.. ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు గంజాయి స్మగ్లింగ్, రవాణా చేస్తూ పట్టుబడి జైలు నుంచి వచ్చాకా.. ఇప్పుడేం చేస్తున్నారు…? తదితర విషయాలను క్షేత్ర స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు. గంజాయి వాడే అడ్డాలు, ప్రాంతాలను గుర్తించి.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయి వాడవద్దని, దానిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తున్నారు.
ప్రజలతో మమేకమైన పోలీసులు.. గంజాయి నిర్మూలన కోసం వారిని కూడా భాగస్వాములు చేస్తున్నారు. బస్తీలు, కాలనీల పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేసి నగరాన్ని డ్రగ్స్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు తమకు సహకరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు డయల్ 100కు, 9490616555లతో పాటు స్థానికంగా ఉండే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందికి కూడా సమాచారం ఇస్తున్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ఇందుకు పోలీస్స్టేషన్ల సిబ్బంది, టాస్క్ఫోర్స్, సీసీఎస్లోని నార్కొటిక్ సెల్, స్పెషల్ బ్రాంచ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఐదేండ్ల నుంచి గంజాయి, ఇతర డ్రగ్స్ దందా చేసిన వారి వివరాలను సేకరిస్తున్నాం. సామాన్యులు సైతం సరఫరాదారులతో పాటు గంజాయిని వాడుతున్న వారి సమాచారాన్ని అందిస్తున్నారు. – సీపీ అంజనీకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ధూల్పేటకు చెందిన గంజాయి స్మగ్లర్ అరుణ్ సింగ్ పై ఆదివారం రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ను విధించారు.