బంజారాహిల్స్, జూన్ 18: సినిమాల్లో కథా రచయితగా అవకాశం కోసం సుమారు 30 ఏళ్లుగా ప్రయత్నిస్తూ.. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన కీర్తి సాగర్ వ్యవహారంపై ఫిలింనగర్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. షేక్పేట సమీపంలోని ద్వారకానగర్లో శనివారం తెల్లవారుజామున తన గదిలో అనుమానాస్పద స్థితిలో కథా రచయిత కీర్తి సాగర్ (50) మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు ఫిలింనగర్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకురాలేదు. కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడే కీర్తి సాగర్గా మారాడు..
నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని కరివెన గ్రామానికి చెందిన పాలాది వెంకట సుబ్బయ్య సినీ పరిశ్రమపై ఇష్టంతో సుమారు 30ఏళ్ల క్రితమే చెన్నై వెళ్లినట్లు తేలింది. సినిమాల్లో కథలు రాయాలంటే ఆకర్షణీయమైన పేరు ఉండాలని సినీ పరిశ్రమలోని కొంతమంది స్నేహితులు చెప్పడంతో తన పేరును కీర్తి సాగర్గా మార్చుకున్నాడు. అక్కడ సుమారు 20 ఏళ్ల పాటు ఉండి.. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా, కథా రచయితగా అవకాశాల కోసం ప్రయత్నించినట్లు తెలిసింది. అవకాశాలు రాకపోవడంతోపాటు అప్పులు పెరగడంతో సొంతూరిలో ఉన్న సుమారు 10 ఎకరాల భూమిని సైతం అమ్మేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.
చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నించి విఫలం కావడంతో పదేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చిన కీర్తి సాగర్.. పలు సినిమా షూటింగుల వద్దకు వెళ్లి తనవద్ద కథలు ఉన్నాయని, హీరోలను కలిపిస్తే కథలు వినిపిస్తానని బతిమాలేవాడని తెలిసింది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం చెప్పాలని ఉంది అనే సినిమాకు కో డైరెక్టర్గా పనిచేశాడని, దాంతో త్వరలోనే తనకు మంచిరోజులు రానున్నాయంటూ చెప్పాడని ఇంటి యజమాని తెలిపాడు. సొంతూరిలో ఒక సోదరుడు ఉన్నాడని, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నప్పటికీ ఇప్పటిదాకా మృతదేహాన్ని గురించి వాకబు చేయలేదని పోలీసులు తెలిపారు. సినిమాపిచ్చితో భూమిని అమ్మేయడంతో ఇతర కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోవడం మానేశారని తెలిసింది.