సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ టవర్కు సంబంధించిన కేబుల్, రేడియో రిమోట్ హెడ్స్, రిమోట్ రేడియో యూనిట్స్, బేస్ బాండ్ యూనిట్స్ను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా గుట్టును నగర టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన 9 మంది సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువజేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బషీర్బాగ్లోని సీసీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీపెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేట జిల్లాకు చెందిన బనావత్ నాగరాజు(23), మలోత్ నగేశ్ అలియాస్ వరుణ్(24) చదువు పూర్తయిన తరువాత ఉపాధి కోసం నగరానికి వచ్చి, ఎల్బీనగర్లో ఉంటున్నారు. ఇద్దరు కలిసి ఎయిర్టెల్ నెట్వర్క్లో టవర్ రిగ్గర్గా చేరారు. అంతే కాకుండా.. ఎయిర్టెల్ నెట్వర్క్ సబ్ కాంట్రాక్టర్ జె.వెంకటరమణ వద్ద కూడా పనిచేస్తున్నారు. అయితే, వ్యసనాలకు అలవాటు పడిన నిందితులు సులభంగా డబ్బు సంపాదించేందుకు రిమోట్ రేడియో యూనిట్స్, ఎయిర్టెల్కు చెందిన సెల్ఫోన్ టవర్స్ బేస్ బాండ్స్, కేబుల్ వైర్లను తమ అసిస్టెంట్ ఇంజినీరైన అశోక్తో కలిసి ఖైరతాబాద్, కాచిగూడ, ఎస్ఆర్ నగర్, మధురానగర్, మీర్పేట, వనస్థలిపురం, నాగోల్, హయత్నగర్, శంషాబాద్, బాలానగర్ తదితర ప్రాంతాల నుంచి దొంగిలించారు. దొంగిలించిన సొత్తును సరూర్నగర్కు చెందిన చుక్కొలు శివ(22)కు విక్రయించారు. అనంతరం శివ ఆ సొత్తును కంప్యూటర్ స్క్రాబ్ వ్యాపారం చేసే యూపీకి చెందిన దిల్షాద్ మాలిక్(24), చాంద్ మాలిక్(29), షహర్యాన్ మలిక్(20), సోహెల్ మలిక్(20)కు విక్రయించాడు. ఈ దొంగ సొత్తును యూపీ ముఠా తిరిగి అవసరమున్న వారికి విక్రయించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న నగర టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కాచిగూడ పోలీసులకు అప్పగించారు.
నల్గొండ జిల్లాకు చెందిన నీరుడు చైతన్య(33), లవూరి రవి నాయక్(27) ఉపాధి కోసం నగరానికి వచ్చి ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇద్దరు కలిసి జియో నెట్వర్క్లో టవర్ టిగ్గర్స్గా చేరారు. కొన్ని రోజుల తరువాత రవినాయక్ ఉద్యోగం మానేసి, ఆటో నడపడం మొదలు పెట్టాడు. కాగా, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చైతన్య తన పాత ఉద్యోగి రవితో కలిసి రిమోట్ రేడియో హెడ్స్, కేబుల్ తీగలు వంటివి దొంగతనం చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో రెండు కేసుల్లో మొత్తం 9 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రశ్మీపెరుమాళ్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ ఆధ్వర్యంలో దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జకీర్ హుస్సేన్, కాచిగూడ ఇన్స్పెక్టర్ పి. లక్ష్మీకాంత్రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.