సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ) : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆమెకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే హెచ్ఎండీఏలో జాయింట్ కమిషనర్ హోదా లేదు. ఆమ్రపాలికి ఆ పదవి ఇవ్వడంపై చర్చ జరుగుతున్నది.
సెక్రటరీ పోస్టును అప్గ్రేడ్ చేసి జేసీగా ఇచ్చారా? అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కమిషనర్తో పాటు జాయింట్ కమిషనర్ కూడా కొనసాగే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే సుమారు ఐదేండ్ల కాలంగా హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆ బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన స్థానంలో పూర్తి స్థాయి కమిషనర్ బాధ్యతలను సీనియర్ ఐఏఎస్కు ఇస్తారన్న చర్చ కూడా ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్నది.