శేరిలింగంపల్లి, ఆగస్టు 2: దేశంలో అంబులెన్సు సేవల్లో విప్లవాత్మక మార్పులకు హెల్త్ టెక్ స్టార్టప్ వేదికగా మారుతుందని అంబీపామ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ లియోనార్డ్ జాన్సన్ అన్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్లోని షెరటన్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్ టెక్ వేదికగా అంబీపామ్ ఆధ్వర్యంలో దేశంలోని 15 నగరాల్లో 3500 అంబులెన్సులను అందుబాటులో ఉంచామని, ఈ రోజు నుంచి సేవలు ప్రారంభమయ్యాయన్నారు. ఏ ప్రాంతంలోనైనా ఐదు నిమిషాల్లో అందరికీ అందుబాటులో అంబులెన్సులు ఉంటాయన్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఓ అబులెన్సు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంబీపామ్ పేరిట ప్లే స్టోర్లో ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలని, క్షణాల్లో అంబులెన్సు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అంబులెన్సు ధరలు ఇతర సర్వీసులతో పోలిస్తే అంబీపామ్ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయన్నారు. పలువురు అంబీపామ్ ప్రతినిధులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.