సిటీబ్యూరో: తెలంగాణలో వందేభారత్ రైళ్లకు వందశాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నా.. మరిన్ని రైళ్లు కేటాయించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ముందుగా ఉత్తర భారత్ వందేభారత్లు ప్రారంభించిన కేంద్రం ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మార్గాన్ని ప్రారంభించగా, మంచి ఆదరణ లభిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ప్రారంభించిన 13 పైగా వందేభారత్ల కంటే.. తెలంగాణ నుంచి నడుస్తున్న రైళ్లకు అధిక ఆక్యుపెన్సీ నమోదు కావడంతో ఆదాయం బాగానే వస్తున్నదని రైల్వే బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రెండు వందేభారత్లకు ప్రతి రోజూ కూడా వంద శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పుడున్న రెండు కాకుండా అదనంగా మరో ఐదు రైళ్లను కేటాయించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. మిగితా వందేభారత్ల కంటే ఇక్కడ అధిక ఆదాయం నమోదవుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇక్కడి ఆదాయంతో ఇతర రాష్ర్టాల్లో వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారని, ఇక్కడి ప్రయాణికుల అవసరం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వందేభారత్లు, రిజర్వేషన్ ఎక్స్ప్రెస్ రైళ్లు, సరుకు రవాణా ద్వారా అధిక ఆదాయం వస్తున్నట్లు స్వయంగా రైల్వే అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ.. ఆ ఆదాయాన్ని కేంద్రం ఇక్కడి రైల్వేల కోసం ఖర్చు పెట్టడం లేదని, ఇతర రాష్ట్రానికు ఆదాయాన్ని తరలిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ వల్ల అధిక ఆదాయం నమోదవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరలోనే మరో ఐదు రైళ్లను ఇక్కడ ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు. సికింద్రాబాద్-తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య మరో వందేభారత్ను నడపాల్సిన అవసరమున్నదని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి పుణె/ ముంబై, బెంగళూరు, నాగ్పూర్, చెన్నై వంటి రైల్వే స్టేషన్ల మధ్య వందేభారత్ను ప్రారంభించాల్సిన అవసరం ఉందంటున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న స్లీపర్ కోచ్ వందేభారత్ను తొలుత తెలంగాణ నుంచే ప్రారంభించాలన్న డిమాండ్ కూడా ప్రయాణికుల్లో వ్యక్తమవుతున్నది.