కవాడిగూడ, జనవరి 2 : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా పేదలకు వైద్యాన్ని అందిస్తున్నది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నియోజక వర్గంలోని ముషీరాబాద్, భోలక్పూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు డాక్టర్ కృష్ణమోహన్రావు నేతృత్వంలో ప్రతి గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వయోవృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. చలికాలం దృష్ట్యా వృద్ధులు అ త్యంత జాగ్రత్త వహించాలని, ముఖ్యంగా పడుకునేముందు వెచ్చగా వుండే దుప్పట్లు వాడాలని సూచించారు.
ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు
బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, శ్వాస సంబంధిత పరీక్షలు, దంత, కండ్లు, ముక్కు, చెవి, ఫిజియోథెరపీ, లివర్ ఫంక్షన్, హెచ్బీఏ1సీ, లిఫిట్ ప్రొఫైల్, డైరెక్ట్ ఎల్డీఎల్, నైట్రోజన్ తదితర వైద్య పరీక్షలు వెంటనే నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. అవసరమైన వారికి మరింత మెరుగైన వైద్యాన్ని అందించేందుకు గాంధీ, ఉస్మానియా దవాఖాలకు తరలిస్తున్నారు.
వృద్ధులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
వృద్ధులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ప్రతి గురువారం వృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి మం దులు పంపిణీ చేస్తున్నాం. బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు ఇతర సమస్యలు ఏవైనా ఎదురైతే వెంటనే దవాఖానకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలి.
-డాక్టర్ కృష్ణమోహన్ రావు, వైద్యాధికారి