గ్రేటర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన అభ్యర్థులందరూ ఇక ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తలరాతలన్నీ ఈవీఎంలలో నిక్షిప్తం చేసి వాటిని భారీ బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఓటరు తీర్పు ఎటు వైపు ఉందో తెలుసుకోవడానికి ఈ నెల 3 వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇదిలా ఉంటే మూడోసారి అధికారం పక్కా అని, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు.
– సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, నవంబరు 30 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్ ప్రజలు మళ్లీ నిర్లక్ష్యాన్ని వీడలేదు. ఓటర్లుగా పేర్లయితే నమోదు చేసుకున్నారు కానీ పోలింగ్ బూత్ వరకైతే రాలేకపోయారు. 2018 సంవత్సరంలో 50.3 పోలింగ్ శాతం నమోదు అయితే ఈ సారి 49 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. దీనిక్కారణం నవ ఓటర్లు.. యువ ఓటర్లు ఎంతో పెరిగినా పోలింగ్లో వారి పాత్ర నామమాత్రంగానే కనిపించింది. ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించినా పోలింగ్లో పెద్దగా పెరుగుదల కనిపించలేదు.
పార్కులు, మాల్స్ తదిరతరవైనవన్నీ బంద్ పాటించినా ప్రజలు హాలిడేగానే చూశారు. చాలా మంది ఓటరు గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని మాత్రమే ఓటర్లుగా పేరు నమోదు చేయించుకున్నారని పలువురు వ్యాఖ్యానించారు. ఫేస్బుక్, ట్విట్టర్ల పోస్టులతో సమస్యలపై వేలేత్తి చూపే సాఫ్ట్వేర్, యువత కూడా పాలకుడిని ఎన్నుకునే విషయంలో మౌనం వహించారు. ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకున్నా లెక్క చేయకుండా వృద్ధులు పోలింగ్ బూత్ల వద్ద భారీగా క్యూలో నిలబడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని పలువురిని ఆదర్శంగా నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. నగర శివార్లలో ఓటింగ్ నమోదు అధికంగా నమోదు కావడం గమనార్హం.
హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి చెదురు మదురు సంఘటనలు జరగకుండా ఓటర్లు పూర్తిగా సహకరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కృషి చేసిన పోలీస్, మీడియా, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు.
– రొనాల్డ్రాస్