వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 23 : ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ… ఈ రెండు వ్యవసాయానికి రెండు కండ్లు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తరువాత సాగు కొత్త పుంతలు తొక్కడం కీలక భూమిక పోషించాయి. 2014 నుంచి దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించింది.
వర్సిటీలో గల 400 రకాల వృక్షజాతులు, 80 రకాల పక్షులు, 350 అరుదైన జాతులతో జీవ వైవిధ్యం విరాజిల్లుతున్నది. దక్కన్ పీఠభూమిలో ఉన్న వైవిద్యమైన వాతావరణంలో ఉన్న బయోడైవర్సిటీ పార్క్ను ధ్వంసం చేసేలా, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉన్న ఈ రెండు యూనివర్సిటీల పరిధిలోని దాదాపు 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకొచ్చిన జీవో నెం.55పై విద్యార్థిలోకం భగ్గుమన్నది. యూనివర్సిటీ భూములు కాపాడేందుకు రోజుకో తీరున నిరసన తెలుపుతున్నారు. సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్, సేవ్ ఫార్మర్స్, స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్ అంటూ సంక్రాంతి సెలవులనూ లెక్కచేయకుండా విద్యార్థులు చేపట్టిన ధర్నాలకు అఖిల పక్ష నాయకులు మద్దతు ప్రకటించారు.
రాజేంద్రనగర్తో పాటు నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, సిరిసిల్ల, వరంగల్ ,ఆదిలాబాద్, వర్సిటీ బ్రాంచ్లలోనూ రోజూ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వర్సిటీ కళాశాల విద్యార్ధి సంఘాల నాయకులు రాజ్ కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్,దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్ రెడ్డి, శంకర్ నాయక్, రాకేష్, ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.