మణికొండ, డిసెంబర్ 22: చారిత్రాత్మక పోసారం గుట్ట హనుమాన్, వెంకటేశ్వరాలయ భూముల జోలికి వస్తే సహించేది లేదని నార్సింగి గ్రామస్థులు, హిందూ సంఘాలు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే…గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని నార్సింగి గ్రామ సర్వే నం.126లో 6ఎకరాల 08 గుంటల భూమి పోసారం గుట్ట సర్కారు భూమిగా నమోదై ఉన్నది. కాగా సర్వే నం.127 నుంచి 130, 130/పార్టులో 7ఎకరాల 30 గుంటల భూమి తనకు ఉందని భూ యజమాని ఒకరు ఆలయ భూమి పరిధిలో జేసీబీలతో చదును చేస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం స్తూ శుక్రవారం పనులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఆందోళన చెలరేగి, పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో నార్సింగి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
అనంతరం నార్సింగి గ్రామస్థులు, హిందూ సంఘాలు కలిసి ఆందోళనకు దిగారు. పోసారం గుట్ట భూములను గతంలోనూ ఓ రియల్టర్ ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు పడమటి భాగాన ఉన్న భూ యజమాని ఆలయ ఆనవాళ్లను సైతం లెక్క చేయకుండా జేసీబీలతో చదును చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ భూముల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని, ఆలయ భూముల చుట్టూ రియల్టర్లు కుట్రపూరితంగా విలువైన భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్యాతం అశోక్యాదవ్, నాయకులు వేణుగౌడ్, వినోద్కుమార్, ప్రభాకర్, రాము, వెంకటేశ్, గాంధీ, రాజీవ్ ఆరోపించారు. రెవెన్యూ అధికారులు సైతం పారదర్శకంగా సర్వేలు చేసి ఆలయ భూమిని పరిరక్షించాలని కోరారు.
అదేవిధంగా కొండలు, గుట్టలతో ఆహ్లాదకరంగా ఉన్న పోచారం గుట్టను రాత్రికిరాత్రే చెట్లను, రాళ్లను తొలగించిన ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నార్సింగి గ్రామస్థులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తమకు చెందిన భూమికి హద్దురాళ్లను చూపించేందుకు సహరించాలని భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయానికి సంబంధించిన సర్వే నంబరు భూమిని ఆక్రమించుకోవాల్సిన అవసరం తమకు లేదని, తాను నిత్యపూజలు చేస్తానని, ఆలయానికి ఇరు వర్గాలు కలిసి భూమిని కేటాయిస్తూ, తమకు న్యాయం చేయాలని సదరు భూ యజమానికి పోలీసుల సమక్షంలో కోరారు. ప్రభుత్వ అధికారుల సర్వే తర్వాత పరిష్కరించుకోవాలని, అప్పటి వరకు ఎవరూ వివాదాస్పద భూమిలోకి వెళ్లవద్దంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఇరువర్గాలకు సూచించారు. దీంతో ఆందోళన విరమించారు.