సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అఫ్గానిస్థాన్లోని అగమ్యగోచర పరిస్థితులు హైదరాబాద్ రోగులపై ప్రభావం చూపుతున్నాయి. అదేంటని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజం. అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి నుంచి వచ్చే పలు ప్రత్యేక ఉత్పత్తుల దిగుమతి ఆగిపోయింది. ఇందులో యునానీ, హెర్బల్ ఉత్పత్తులు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ నుంచి అరుదైన వేర్లు, కాడలు, మొక్కలకు సంబంధించిన ఔషధాలు నగరానికి దిగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం అఫ్గానిస్తాన్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వాటి సరఫరా నిలిచిపోయిందని నగరానికి చెందిన యునానీ, హెర్బల్ ఫార్మా నిర్వాహకులు చెబతున్నారు. ప్రధానంగా రా మెటీరియల్ ములేతి (లికోరైస్), వామ్వుడ్, జుజుబీ, అకర్కరా, డ్రైడ్ ప్లమ్, జఫ్రాన్, రా హింగ్, స్వచ్ఛమైన తేనె, సోలో గార్లిక్ తదితర అఫ్గాన్ ఉత్పత్తులు నగరానికి చేరడం లేదు. దీంతో ఈ మూలికలతో వైద్యం తీసుకునే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నగరంలో సుమారు వెయ్యికి పైగా యునానీ, హెర్బల్ స్టోర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టోర్లలో అమ్మే ఉత్పత్తులన్నీ అఫ్గాన్ నుంచి రావాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు, జలుబుకు విరుగుడైన స్వచ్ఛమైన తేనె, లికోరైస్తో తయారయ్యే ఔషధం, జీర్ణక్రియకు ఉపయోగపడే సిరప్లలో ఉపయోగించే హింగ్ కొరత ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే అఫ్గాన్ నుంచి దిగుమతి అయ్యే ఈ ఉత్పత్తులను ప్రస్తుతం ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కానీ నాణ్యత అంత బాగుండదనేని పలువురి అభిప్రాయం. మెడిసిన్స్ తయారీదారులు నేరుగా అఫ్గాన్ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయరు. వారికి హెర్బల్ మెడిసిన్ ఫార్మసిస్టుల నుంచి సేకరిస్తారు. అయితే దిగుమతి అయిన హెర్బల్ ఉత్పత్తులపై 5 నుంచి 15 శాతం వరకు ధరలు పెరిగాయి. అంతేకాక నూరాని పంజెరి, శీకాకాయ పొడి, అశ్వగంధ, పూప్ ఏ రహత్, పల్లేరు కాయ తదితర ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి.
అఫ్గానిస్థాన్ నుంచి హెర్బల్ ఉత్పత్తులతో పాటు ఇలాచి, దాల్చిన, డ్రైఫూట్స్ దిగుమతి చేసుకుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితులతో ఉత్పత్తుల దిగుమతి ఆగిపోయింది. వారం రోజుల్లో యునానీ, హెర్బల్ ఉత్పత్తుల ధరలు అమాంతం పెరగడం ఖాయం. అనేక రోగాలకు యునానీలో మంచి మందులు ఉన్నాయి. ఈ మందులతో ఎలాంటి దుష్ఫలితాలు లేకపోవడంతో ఎందరో ఈ వైద్యాన్ని నమ్ముతున్నారు. అఫ్గాన్లో పరిస్థితి కుదుటపడే వరకు కొన్ని మందుల కొరత తప్పదు. -షిరాజ్, హెర్బల్ ఫార్మా నిర్వాహకుడు, నాంపల్లి
అబిడ్స్, ఆగస్టు 21: అఫ్గానిస్థాన్ సంక్షోభంలో చిక్కుకోవడంతో ఆ ప్రభావం హైదరాబాద్కు దిగుమతి అయ్యే డ్రై ఫూట్స్పై పడింది. దీంతో ధరలు అమాంతం పెరగడంతో అమ్మకాలు పడిపోయాయి. అఫ్గాన్ నుంచి అంజీర్, ఖుర్బాని, అక్రోట్, మునక్క, కిస్మిస్లను ముంబై, ఢిల్లీకి చెందిన వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్కు చెందిన వ్యాపారులు తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. ముఖ్యంగా నగరంలోని బేగంబజార్, మహబూబ్మాన్షన్, సికింద్రాబాద్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో డ్రై ఫూట్స్ అమ్మకాలను హోల్సేల్గా నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు డ్రైఫూట్స్ దోహదపడుతాయని వైద్యులు సూచించడంతో వాటి వినియోగం గత సంవత్సరం నుంచి అమాంతం పెరిగింది. దీంతో మహానగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన బేగంబజార్లో డ్రై ఫూట్స్ అమ్మకాలు సాధారణ రోజులతో పోలిస్తే 20 శాతం పెరిగినట్లు వ్యాపారులు వివరిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గాన్ నుంచి దిగుమతి నిలిచిపోవడంతో పలు రకాల డ్రై ఫూట్స్ ధరలు పెరగడంతో 40 శాతం అమ్మకాలు తగ్గినట్లు వారు పేర్కొంటున్నారు.
అఫ్గానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించడంతో డ్రై ఫూట్స్ ధరలు భారీగా పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. ప్రధానంగా అంజీర్, ఖుర్బాని, కిస్మిస్, అక్రోట్, మునక్కలు అక్కడి నుంచి దిగుమతి అవుతాయి. అఫ్గాన్ నుంచి డ్రైఫూట్స్ సరాసరి ముంబై పోర్ట్కు వచ్చి అక్కడి నుంచి నగరానికి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం అమ్మకాలు దాదాపు 40 శాతం తగ్గాయి. -కపిల్ టండన్, కశ్మీర్ హౌస్ వ్యాపారి, బేగంబజార్