హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఎంపీఎల్ జాతీయ సబ్జూనియర్ చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ఆదిరెడ్డి అర్జున్, గంటా కీర్తి రన్నరప్స్గా నిలిచారు. బాలుర అండర్-15 విభాగంలో అర్జున్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ప్రత్యర్థి ప్లేయర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన అర్జున్ మొత్తం 11 పాయింట్లకు గాను తొమ్మిది పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో నిలిచాడు. మరోవైపు బాలికల కేటగిరీ సపర్య ఘోష్(8)తో జరిగిన తుదిపోరును డ్రా చేసుకోవడం ద్వారా కీర్తి(9) ద్వితీయ స్థానం దక్కించుకుంది. జాతీయ టోర్నీలో రజత పతకాలు సొంతం చేసుకున్న అర్జున్, కీర్తిని రాష్ట్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు.