Sonu Sood | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 19: సినిమాల్లో నటించి..కోట్లు సంపాదించినా రాని ఆనందం పేదలకు సేవ చేస్తేనే వస్తున్నదని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ అన్నారు. ఏదైనా సమస్య వస్తే ప్రజలు తనకు ఫోన్ చేయాలని, సాయం చేస్తానని చెప్పారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతిలో సామాజికవేత్త సిద్ధూరెడ్డి తన సొంత డబ్బులతో అధునాతన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని నటుడు సోనూసూద్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, నిర్మాత దాత సిద్ధూరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సోనూసూద్ మాట్లాడుతూ తనకు బాలీవుడ్ కంటే తెలుగు సినిమాలతోనే మంచి పేరు వచ్చిందన్నారు.
కరోనా సమయంలో ప్రజలకు వచ్చిన ఇబ్బందులను చూసి చలించిపోయి.. సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాల భవనాన్ని తన సొంత ఖర్చులతో నిర్మించిన సిద్ధూరెడ్డిని ఆయన అభినందించారు. తెలంగాణలోని సర్కారు ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన వస్తువులు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గణేశ్గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ రాచమల్ల సిద్ధేశ్వర్, వైస్ చైర్మన్ బండిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.