శేరిలింగంపల్లి, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): కొండాపూర్ మై హోం మంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో సైబరాబాద్ పోలీసులు మంగళవారం ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… ఆదివారం అర్ధరాతి 11.:30 గంటల సమయంలో కొండాపూర్ మైహోం మంగళ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఆ సమయంలో కారులో అభిషేక్, సాయిప్రకాశ్, అశ్రిత, తరుణి ఉన్నారు. అంతకుముందు వీరంతా స్నాట్ పబ్లో ఫ్రెండ్ షిప్ డే వేడుకులు నిర్వహించుకున్నారు. అక్కడ అభిషేక్, సాయిప్రకాశ్ మద్యం సేవించారు. తిరిగి వెళ్తుండగా కారును అతి వేగంగా నడిపించారు. అదుపుతప్పి మట్టి దిబ్బను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న అశ్రిత మృతి చెందగా తరుణి, సాయిప్రకాశ్ తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
మద్యం మత్తులో కారును అతి వేగంగా నడిపి ప్రమాదంలో యువతి మరణానికి కారకుడైన అభిషేక్ (డ్రైవర్)తో పాటు మద్యం సేవించి కారును నడిపిస్తున్నా పట్టించుకోకుండా వారిని ప్రోత్సహించారనే అభియోగంపై స్నాట్ పబ్ యజమాని చగన్లా సూర్యనాథ్, మేనేజర్ ప్రనేశ్ హర్లీని గచ్చిబౌలి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కారులో ప్రయాణించిన అభిషేక్ స్నేహితుడు సాయిప్రకాశ్ దవాఖానలో చికిత్స పొందుతుండటంతో అతడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరందరిపై ఐపీసీ 304 పార్ట్-2తో పాటు 337, 109 185(ఏ), 188 ఎంవీ యాక్ట్ సెక్షన్లను నమోదు చేశారు. వీరిని 14 రోజుల పాటు రిమాండ్కు తరలించారు. స్నాట్ పబ్ను నిర్వహిస్తున్న సూర్యనాథ్, మేనేజర్పై మాదాపూర్ పీఎస్లో మరో కేసు నమోదైంది. బోనాల సందర్భంగా మద్యం అమ్మకాలను నిషేధిస్తూ పోలీసు కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి, అక్రమంగా మద్యం విక్రయించడంతో వారిపై 188, 34 ఏ, 36 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.