శుక్రవారం నగర రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఒకరు బైక్ అదుపుతప్పి కింద పడి, మరొకరు మద్యంమత్తులో రోడ్డు దాటుతూ, ఇంకో ఘటనలో డీసీఎం ఢీ కొని మహిళ, పాలవ్యాన్ ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఏదైనప్పటికీ.. రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎన్నో ఆశాలు పెట్టుకున్న వారి కుటుంబాలకు తీరని మనోవేదన మిగిల్చాయి.
దుండిగల్, జూలై 2 : ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారం మండలం, పోతారంలోని తెలంగాణ కాలనీకి చెందిన దొమ్మ యాదగిరి అలియాస్ ప్రభాకర్(46), ఇందిరమ్మ దంపతులు. యాదగిరి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఇందిరమ్మ గృహిణి. ఈ క్రమంలో యాదగిరి చర్చిగాగిళ్లాపూర్లోని తన బావమరిది వాసుదేవ్ ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి జూన్ 30న(బుధవారం) చుట్టపుచూపుగా వెళ్లాడు. అయితే ఈనెల 1న(గురువారం) రాత్రి 11:30 గంటల ప్రాంతంలో యాదగిరి ఒక్కడే తన బైక్(ఏపీ23, ఏకే2699)పై ఒంటరిగా పోతారంలోని తన ఇంటికి బయలుదేరి వెళ్లాడు. ఈ క్రమంలో గాగిళ్లాపూర్లోని ఎస్ఎంఎస్ పరిశ్రమ సమీపంలోకి రాగానే.. బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన దుండిగల్ పెట్రోలింగ్ పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శేరిలింగంపల్లి, జూలై 2 : పాల వ్యాన్ ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుల్బర్గా ప్రాంతానికి చెందిన రాకేశ్ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి కొండాపూర్ మసీదుబండలో నివాసముంటున్నాడు. గుజరాత్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసే స్నేహితుడు మల్లాస్ ఖాన్(29) వారం కిందట రాకేశ్ దగ్గరకు వచ్చారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున మల్లాస్ఖాన్, రాకేశ్ తమ్ముడు అకాశ్తో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లారు. కొండాపూర్ చిరెక్ పబ్లిక్ స్కూల్ ప్రాంతంలో పాలవ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మల్లాస్ఖాన్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలపాలైన అకాశ్ కొండాపూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మూసాపేట, జూలై 2 : మద్యం మత్తులో రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి 9వ ఫేజ్కు చెందిన సురేశ్ కుమార్(32) బేగంపేటలోని క్యూ కనెక్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం (మెట్రో స్టేషన్ ఫిల్లర్ ఏ-857) వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన సురేశ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.