పహాడీషరీఫ్, ఫిబ్రవరి 19 : బంగారు నగలు తీశావని తల్లి నిలదీయడంతో తనయుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్సై వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్స్టేషన్ పరిధిలోని మామిడిపల్లిలో నివాసముంటున్న రాజశేఖర్(26) ప్రైవేట్ ఉద్యోగి. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు.
ఉన్న డబ్బులు అయిపోయేసరికి బీరువాలో తల్లి దాచుకున్న తులంన్నర బంగారు ఆభరణాలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లాడు. వాటిని తాకట్టుపెట్టి ఆ డబ్బంతా ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. అయితే ఈనెల 18న తల్లి బంగారు నగలు ఎందుకు తీశావని, ఎక్కడ తాకట్టుపెట్టావో తీసుకురమ్మని కొడుకుని నిలదీసింది. దీంతో రాత్రి ఎయిర్పోర్ట్లో డ్యూటీకి వెళ్లిన అతడు అర్ధరాత్రి తమ్ముడు వంశీ వాట్సాప్కు మెసేజ్ చేశాడు.
శంషాబాద్ పాత పోలీస్స్టేషన్ వెనుక ఉన్న బంగారు దుకాణంలో తాకట్టుపెట్టి రూ.40వేలు తీసుకున్నానని, ఆ స్లిప్ ఫోన్కవర్లో ఉందని, బెట్టింగ్కు బానిసయ్యానని, పోగొట్టుకున్న డబ్బును తీసుకురాలేక చనిపోవాలనుకుంటున్నానని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం పొలంలో వేప చెట్టుకు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.