Hyderabad | మారేడ్పల్లి, జూన్ 8: “నేను నిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పని చేస్తున్నాను.. నాకు పెద్ద పెద్ద డాక్టర్లు పరిచయం ఉన్నారు. మీకు ఎలాంటి జబ్బు ఉన్నా.. నిమిషాల్లో నయం చేస్తాను”.. అంటూ ఓ నకిలీ వైద్యుడు మహిళకు మత్తు మందులు ఇచ్చి, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బంగారు ఆభరణాలు, సెల్ఫోన్తో పరారయ్యాడు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా, పీఠాపురం ప్రాంతానికి చెందిన నూకల సుజాత (50) కేపీహెచ్బీలోని పీజేఆర్ కాలనీలో ఉంటుంది. ఈనెల 2న ఆమె బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హజరయ్యేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలులో పీఠాపురానికి బయలుదేరింది. అదే రైల్లో ఓ వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్యుడినని, పని నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు వెళ్తున్నానని చెప్పాడు.
ఈ నకిలీ వైద్యుడి మాటలు నమ్మిన బాధితురాలు సుజాత.. తన ఆరోగ్య సమస్యల గూర్చి అతడికి వివరించింది. మీరు తిరిగి నగరానికి వచ్చిన తరువాత మీ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తానని నమ్మించి.. సుజాత సెల్ నంబర్ తీసుకొని రైలు దిగి వెళ్లిపోయాడు. అనంతరం ఈనెల 6వ తేదీన సుజాత పీఠాపురం రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి నగరానికి బయలుదేరింది. వైద్యుడిగా పరిచయమైన వ్యక్తి సుజాతకు ఫోన్చేసి ఎక్కడ ఉన్నారు.. ఎప్పుడు వస్తున్నారు.. అని అడిగి వివరాలు తెలుసుకున్నాడు. ఈనెల 7న ఉదయం 8 గంటలకు సుజాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు దిగింది.
లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని…
సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్ గురుద్వారా మందిర్ వెనుక భాగంలో ఉన్న సాయి వినాయక లాడ్జిలో ఓ గదిని నకిలీ డాక్టర్ అద్దెకు తీసుకున్నాడు. బాధితురాలు సుజాతకు నకిలీ వైద్యుడు ఫోన్చేసి.. నేను ఫలానా లాడ్జిలో ఉన్నాను.. మీకు కావాల్సిన మందులు అన్ని ఇక్కడే ఉన్నాయి.. వచ్చి తీసుకొని వెళ్లండి.. అంటూ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె లాడ్జికి వెళ్లగా.. నకిలీ డాక్టర్ తన వద్దనున్న మత్తు మందులను ఆమెకు ఇచ్చి వేసుకోమని చెప్పాడు. ఆమె ఆ మందులను వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
ఆ నకిలీ డాక్టర్ వెంటనే సుజాత బ్యాగ్లో ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసు, ఒక సెల్ఫోన్ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సుజాత స్పృహలోకి రావడంతో గదిలో ఎవరూ కనిపించలేదు. ఆమె బ్యాగ్లో ఉన్న బంగారు గొలుసు, సెల్ఫోన్ కూడా కనిపించలేదు. చాలా సేపటి వరకు నకిలీ డాక్టర్ రాకపోవడంతో.. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.