హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక శబ్దం చేసే వాహనాల కట్టడికి ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. శబ్ద కాలుష్యం చేసే వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టనున్నారు. అధిక శబ్దం చేసే వాహనాలను ఆధునిక కెమెరాలతో పోలీసులు గుర్తించనున్నారు. ఇందులో భాగంగా జర్మనీ టెక్నాలజీతో తయారు చేసిన కెమెరాల పనితీరును బుధవారం ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ బృందం పరిశీలించింది. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్లోనే ట్రాఫిక్ విభాగంలో ఈ టెక్నాలజీకి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించారు. జర్మనీకి చెందిన అకోమ్ గ్రూప్ ప్రతినిధులు ఆ కెమెరాల పనితీరు గురించి రంగనాథ్తో భేటీ అయి వివరించారు.
కెమెరాల పనితీరును జాయింట్ సీపీ రంగనాథ్, డీసీపీలు ప్రకాష్రెడ్డి, కరుణాకర్, ఐటీసెల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు, అడ్మిన్ ఇన్స్పెక్టర్ రాజు, పొల్యూషన్ బోర్డు కంట్రోల్ అధికారులు పరిశీలించారు. కెమెరాలు పనిచేసే విధానాన్ని తెలుసుకున్న జాయింట్ సీపీ మాట్లాడుతూ.. తమకు అనుకూలంగా సాప్ట్వేర్ తయారు చేసి, ఏఎన్పీఆర్(ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) కెమెరాలకు అనుసంధానం చేయాలని సూచించారు. ఇజ్రాయిల్ దేశంలో వాడుతున్న పద్దతి కూడా అలాగే ఉందని, ట్రాఫిక్ విభాగానికి అవసరమయ్యే విధంగా సాప్ట్వేర్లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఒక చౌరస్తాలో హారన్ ఏ వాహనం నుంచి వస్తుందనే విషయాన్ని ఈ కెమెరాలు గుర్తిస్తున్నాయని, అదే విధంగా ఆ వాహనం నెంబర్ ప్లేట్ను కూడా రికార్డు చేయాలని సూచించారు. ఒకేసారి ఆ చౌరస్తాలో ఎంత మంది హారన్ కొట్టారనే విషయాన్ని కూడా ఆ కెమెరాలు వాహనం నెంబర్ ప్లేట్తో సహా గుర్తించాలన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక శబ్దం చేసే వాహనాలను జర్మనీ టెక్నాలజీతో తయారు చేసిన కెమెరాల పనితీరును ట్రాఫిక్ పోలీసులు పరిశీలించారు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్లోనే ట్రాఫిక్ విభాగంలో ఈ టెక్నాలజీకి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించారు. pic.twitter.com/ffWvNOB24F
— Namasthe Telangana (@ntdailyonline) April 20, 2022