సిటీబ్యూరో, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరం వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపే వారిపై బుధవారం నుంచి కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో మంగళవారం క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భద్రతా ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు.
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. డిసెంబర్ 31రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేపడతామని సీపీ తెలిపారు. ఇందుకోసం ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతామన్నారు. కొత్త సంవత్సరం జోష్లో మోతాదుకు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహన సీజ్తో పాటు పదివేల జరిమానా, ఆరునెలల జైలు శిక్ష తప్పదని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేస్తామని చెప్పారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డెసిగ్నేటెడ్ డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లను ఆశ్రయించాలని చెప్పారు. యువత రోడ్లపై రేసింగ్లు, వీలింగ్లు, ర్యాష్ డ్రైవింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2026 స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే తప్ప చేదు అనుభవాలుగా మారకూడదని హితవు పలికారు.
డిసెంబర్ 31 రాత్రి పబ్లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్థరాత్రి ఒంటిగంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శబ్ధ కాలుష్య నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్లను సీజ్ చేస్తామని, ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, రద్దీ ప్రాంతాలు, పార్టీ వేదికలు, జంక్షన్లలో మఫ్టీలో 15 షీటీమ్స్ నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్ట్ చేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో క్రైమ్స్ అదనపు సీపీ శ్రీనివాసులు, డీసీపీలు శ్వేత, రక్షితాకృష్ణమూర్తి, రూపేశ్, ఆర్.వెంకటేశ్వర్లు, వి.అరవింద్ బాబు, లావణ్యనాయక్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.