సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : రెండవ స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అర్హులైన వారందరూ ఓటరు నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో పోలింగ్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. స్వచ్ఛమైన, పటిష్టమైన ఓటరు జాబితా తయారీలో భాగంగా 18 ఏండ్లు నిండిన వారు, ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారితో పాటు అక్టోబర్ 1, 2023 నాటికి 18 ఏండ్లు నిండబోయే వారు ముందస్తుగా నమోదు చేసుకోవచ్చన్నారు.
21 ఆగస్టు 2023న ఓటరు జాబితా ముసాయిదా విడుదల చేసిన నేపథ్యంలో జాబితాలో పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. పేరులో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే సవరించుకునే అవకాశం ఉందని, ప్రత్యేక క్యాంపెయిన్ సందర్భంగా మీ బూత్ లెవెల్ అధికారి పోలింగ్ స్టేషన్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని వివరించారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఆధార్ అనుసంధానంకు ఫారం-6బీ, ఓటరు జాబితా అభ్యంతరాలు, ఓటరు తొలగింపునకు ఫారం-7, మార్పులు చేర్పులకు ఫారం-8 ద్వారా సెప్టెంబర్ 19, 2023 వరకు నమోదు చేసుకోవచ్చని, వెబ్సైట్ ceotelangana. nic.inలో కూడా పరిశీలన చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.