ఖైరతాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. జలమండలి అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో స్థానికులు తమ సమస్యను బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం బస్తీని సందర్శించిన గోవర్ధన్రెడ్డికి స్థానిక మహిళలు తమ నీటి గోసను ఏకరువు పెట్టారు. 15 రోజులుగా నల్లా నీరు రావడం లేదని, వచ్చే నీరు సైతం కలుషితంగా ఉంటున్నదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా మంచినీటి కోసం దాహార్తితో ఎదురుచూస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడటం సహించబోమని, త్వరగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జలమండలి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజన్కుమార్, రమేశ్, ఆంజనేయులురెడ్డి, బాలుయాదవ్ పాల్గొన్నారు.