Hyderabad | మియాపూర్, ఏప్రిల్ 22 : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యతో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ జనప్రియ నగర్లో నివాసం ఉండే మహేష్ రెండేళ్ల క్రితం శ్రీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఏడాది పైబడిన కూతురు ఉన్నది.
క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్న మహేష్ మద్యం మత్తుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో తరచూ భార్యాభర్తల మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. మహేష్ పెట్టె హింస భరించలేక శ్రీదేవి తన పుట్టింటికి వెళ్ళింది. తన తమ్ముడి ఇంట్లో పుట్టినరోజు వేడుకలకు వెళ్లాల్సి ఉందని మహేష్ తన భార్య శ్రీదేవిని పుట్టింటి నుంచి జనప్రియ నగర్లోని తన ఇంటికి సోమవారం పిలిపించుకున్నాడు .ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మరోసారి తగాదా చోటుచేసుకోవడంతో ఆవేశంతో మద్యం మత్తులో ఉన్న మహేష్ కూరగాయలు కోసే కత్తితో తన భార్య శ్రీదేవిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. తీవ్ర గాయాలతో శ్రీదేవి తల్లి ఐసియూలో చికిత్స పొందుతుండగా, శ్రీదేవి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు క్షతగాత్రురాలు శ్రీదేవి వాంగ్మూలం నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు మహేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.