దశాబ్దాలుగా వరద నీటి సమస్యను ఎదుర్కొంటున్న నాగమయ్యకుంట బస్తీ వరద నీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. నాలా మధ్యలో ఇరుకుగా ఉన్న తూములను తొలగించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో వరద నీటి సమస్య పరిష్కారం లభించనుంది. గత యేడాది కాలంగా నాగమయ్యకుంట నాలాపై వాహనాల రాకపోకలకు అనువుగా బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల నాలా శ్లాబు నిర్మాణ పనులు పూర్తవడంతో త్వరలో ప్రారంభానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాలాపై బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో ఇరువైపులా రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాగమయ్యకుంట బ్రిడ్జి అందుబాటులోకి వస్తే హిందీ మహా విద్యాలయం, నల్లకుంట నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్, వీఎస్టీ వైపు వాహనాల రాకపోకలను తిరిగి పునరుద్ధ్దరించనుండగా నాలాపై బ్రిడ్జి నిర్మించడంతో కిందివైపు వరద నీరు సాఫీగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
-ముషీరాబాద్, డిసెంబర్ 1
టీఆర్ఎస్ ప్రభుత్వం గత యేడాది క్రితం నాగమయ్యకుంట వద్ద ఉన్న నాలా తూములను విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధ్దం చేసింది. వరద సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికిగాను రూ 12 కోట్ల వ్యయంతో నాగమయ్యకుంటతోపాటు పద్మకాలనీల వద్ద నాలాలపై బ్రిడ్జిల నిర్మాణానికి (విస్తరణ పనులకు) శ్రీకారం చుట్టింది. తూములను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో 12 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం, పద్మకాలనీలో బాటిల్ నెక్లా(ఇరుకుగా ఉన్న) నాలాను వెడల్పు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి రూ 12 కోట్లు మంజూరు చేసి పనులు మొదలు పెట్టింది. నాలాను 12 మీటర్ల మేర విస్తరించి పై నుంచి వాహనాలు వెళ్లేలా బ్రిడ్జిలు నిర్మించారు. ప్రస్తుతం నాగమయ్యకుంట వద్ద బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకోగా పద్మకాలనీ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
వరద నీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి నాగమయ్యకుంట వద్ద నాలాను విస్తరిస్తూ దానిపై బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఒక వైపు వరద సమస్య, మరోవైపు వాహనాలు సాఫీగా వెళ్లేలా విశాలంగా బ్రిడ్జి నిర్మిం చాం. బిడ్జి నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంది. మిగిలిన చిన చిన పనులు త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
-ముఠా గోపాల్, ఎమ్మెల్యే ముషీరాబాద్