హైదరాబాద్ : నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోని నాలా అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
మయూర్ మార్గ్, బ్రాహ్మణవాడిలలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
SNDP, GHMC, ఎలెక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీడిమెట్ల, బాలానగర్, ఫతే నగర్ల మీదుగా ఉన్న బేగంపేట నాలాకు ఎగువ నుంచి వచ్చే వరదముంపు సమస్యను పరిష్కరించేందుకు గాను బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్, ప్రకాష్ నగర్ కూకట్పల్లి నాలాపై రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపడుతామన్నారు.
నీటి సరఫరా ,మురుగునీటి లైన్లను పునరుద్దరించడం, నాలా వెంట రహదారులను వీడీసీసీతో అభివృద్ధి చేయడం వంటి పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. బ్రాహ్మణవాడి , ప్రకాష్ నగర్ ప్రాంతాలలో గ్యాప్ పోర్షన్లలో కొత్త రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, ఇప్పటికే ఉన్న రిటైనింగ్ గోడల ఎత్తును పెంచుతామన్నారు. 8 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. మంత్రి వెంట కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ సునీల్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.