సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ ) : బుల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. 2020 అక్టోబర్లో కురిసిన రికార్డు స్థాయి వర్షాలకు నదీంకాలనీ, టౌలిచౌకీ, నిజాంకాలనీ, అల్హన్నత్ కాలనీలు పూర్తిగా నీట మునిగి రోజుల తరబడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇందులో భాగంగానే వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించి, ఈ మేరకు బుల్కాపూర్ నాలా అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. రూ. 4.70 కోట్లతో మిలిటరీ ఏరియా నుంచి ఏక్మినార్ మసీద్ వరకు సివరేజీ పనులు ( ఐ అండ్ డీ/ ఇంటరాప్షన్ అండ్ డైవర్షన్), బుల్కాపూర్ నాలా నుంచి రేతిబౌలి జంక్షన్ వరకు, మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతం నుంచి ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్స్ నిర్మాణానికి రూ. 9.75 కోట్ల పనులకు ఇటీవల జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలోనే ఇటీవల ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగా, ఆర్మీ అధికారుల సహకారంతో పనులను ప్రారంభించినట్లు జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ తెలిపారు. బుల్కాపూర్ నాలా ప్రవాహ ఒత్తిడి తగ్గించే క్రమంలో మిలిటరీ ఏరియా రేతిబౌలి వద్ద ఐ అండ్ డీ నిర్మాణం చేపట్టి గుడిమల్కాపూర్ మీదుగా మూసీలోకి వరద నీటిని మళ్లించనున్నారు. వచ్చే వేసవి నాటికల్లా ఈ పనులను పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.