సిటీబ్యూరో, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ)/ సైదాబాద్ : హైదరాబాద్లో అన్ని వర్గాల సహకారంతో పండుగలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. శివరాత్రి, షబ్-ఎ-మెరాజ్(జగ్నే కీ రాత్) పండుగలు రావడంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర సీనియర్ అధికారులు విధుల్లో ఉన్నారు.
సైదాబాద్, సంతోష్నగర్ తదితర ప్రాంతాల్లో నగర కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా సైదాబాద్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ఈస్ట్ జోన్ కార్యాలయాన్ని పరిశీలించారు. పాత మలక్పేట ఏసీపీ కార్యాలయాన్ని డబీర్పురా పోలీస్స్టేషన్పై అంతస్తులోకి మార్చడంతో ఖాళీగా ఉన్న మలక్పేట ఏసీపీ కార్యాలయంలోకి సౌత్, ఈస్ట్ డీసీపీ కార్యాలయాన్ని మార్చారు.
అదేవిధంగా సైదాబాద్ నూతన పోలీస్స్టేషన్ను సందర్శించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పురోగతి, మలక్పేట ఏసీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ వెంట సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సీహెచ్ రూపేష్, మలక్పేట ఏసీపీ శ్యాం సుందర్, సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తదితరులున్నారు.